
- 12.33 లక్షల మంది రైతులకు రూ.15,121 కోట్లు చెల్లించామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు అత్యధికంగా చేశామని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ యేడు యాసంగిలో 8,378 కొనుగోలు కేంద్రాల ద్వారా 72.42 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇది 2023 యాసంగి సీజన్తో పోలిస్తే 12.65 లక్షల టన్నులు అధికమని తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లయ్స్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో, అంటే 2023 జూన్ 8 నాటికి 7,034 కొనుగోలు కేంద్రాల ద్వారా 59 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 8,378 కేంద్రాల ద్వారా 72 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని వివరించారు. 12.33 లక్షల మంది రైతుల నుంచి రూ.16,760 కోట్లు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.15,121 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
2023 ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 9.81 లక్షల మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.5,932 కోట్లు చెల్లించగా, తమ ప్రభుత్వం అదనంగా రూ.9,189 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలకులు గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరించిన విధానాల ద్వారా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిందన్నారు. వ్యవసాయ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని మంత్రి పేర్కొన్నారు.